మీ కమ్యూనిజం ఏమైంది?: పవన్‌కు కూనంనేని సూటి ప్రశ్న

  • పవన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు
  • జనసేన కనుమరుగైనా కమ్యూనిజం నిలిచి ఉంటుందని వ్యాఖ్య
  • పవన్ కల్యాణ్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన తండ్రి, తాను కమ్యూనిస్టులమని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతారని, మరి మీలోని ఆ కమ్యూనిజం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

సనాతన ధర్మం, కమ్యూనిజం, రాష్ట్ర విభజన వంటి అంశాలపై పవన్‌ను ఆయన నిలదీశారు. జనసేన పార్టీ కనుమరుగైనా, కమ్యూనిజం నిలిచి ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లోకి దూకుడుగా ప్రవేశించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అపరిచితుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రపంచ కార్మికులారా విడిపోండని కమ్యూనిస్టులు చెప్పారా అని ప్రశ్నించారు. ఈ విషయంలోకి కమ్యూనిస్టులను ఎందుకు లాగారని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే వచ్చి సవాల్ విసరడమంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్డమే అన్నారు.

Kunamneni on Pawan Kalyan
Pawan Kalyan in Telangana

More Telugu News